గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు.
అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని జంగాలపల్లికి చెందిన అజ్మీరా చందులాల్, బానోత్ శ్రీను, ఇస్లావత్ ఉపేందర్, గుగులోత్ గణేశ్, బానోత్ రవి, మాలోత్ ప్రవీణ్, మాలోత్ శివ, బానోత్ విజమ్, రాంసింగ్, బోడ శంకర్, రామోజీ, శ్రీను కలిసి సమీప అటవీ ప్రాంతంలో ఉచ్చులు వేసి వన్యప్రాణులను హతమార్చేవారు.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఉచ్చులో ఓ ఎలుగుబంటి పడడంతో దానిని హతమార్చారు. ఈ విషయం సోమవారం అటవీ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి ఎలుగుబంటి ఎముకలు, జుట్టు సేకరించి ఫోరెన్సిక్ టెస్టులకు పంపారు.
వన్యప్రాణ్యలను హాని తలపెడితే చర్యలు తప్పవని రేంజర్ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్వో సతీశ్, కర్ణనాయక్ పాల్గొన్నారు.