వనపర్తి : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth reddy ) పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) తీవ్రంగా ఖండించారు.ఈ అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు.
ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తే గానీ క్షేత్రస్థాయిలో తిరగలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు.ప్రజాపాలన అంటే ప్రజలను నిర్భంధించడమా ? ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలను నిర్భంధించి గానీ తిరగలేని సీఎంది ఏం సిపాయితనమని అన్నారు.
తన పాలన మీద తనకు నమ్మకం లేకే రేవంత్ రెడ్డి ఇలా అరెస్టులకు పాల్పడుతు న్నాడని,పోలీసుల పహారా మధ్య ప్రజాపాలన సాగుతున్నదని విమర్శించారు.రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని, రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీకి రాష్ట్రంలో రేవంత్ అరాచకాలు కానరావడం లేదా అని ప్రశ్నించారు.