హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కేతన్సింగ్, మలక్పేటలోని శ్రీసాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, అత్తాపూర్లోని ఫ్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకులు అంచ శ్రీకాంత్రెడ్డి, గుంట మహేశ్వర్రావులతోపాటు నకిలీ సర్టిఫికెట్లు పొందిన ఏడుగురు విద్యార్థులను మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రితో కలిసి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ, వివేకానంద యూనివర్సిటీ ఉత్తర్ప్రదేశ్లోని గ్లోకల్ యూనివర్సిటీ నుంచి నకిలీ సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్టు సీపీ తెలిపారు. తల్లిదండ్రులకు తెలిసి నకిలీ సర్టిఫికెట్లను విద్యార్థులు తీసుకున్నారని, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. ఈస్ట్జోన్ జాయింట్ సీపీ రమేశ్, వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. అంతరాష్ట్ర స్థాయిలో జరిగే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాలను బయటకు తీస్తుందని వెల్లడించారు. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల మాట కూడా వినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని విద్యామండలి చైర్మన్ లింబాద్రి చెప్పారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల సర్టిఫికెట్లను ఇన్స్టాంట్గా డిజిటల్ వెరిఫికేషన్ చేసుకొనే వెసులుబాటు ఉన్నదని అన్నా రు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నదని, అన్ని సర్టిఫికెట్లను డీజీ లాకర్లో పొందుపరుస్తారని పేర్కొన్నారు.