ఖమ్మం, జనవరి 11: చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మంలో 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత కేసీఆర్ మనపై నమ్మకంతో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినపుడు కరీంనగర్ సభ ఎలా చరిత్రలో నిలిచిపోయిందో, ఖమ్మం బీఆర్ఎస్ సభ కూడా అలాగే నిలిచిపోవాలని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందించేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభమై 4.30 గంటలకు ముగుస్తుందని.. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే గాక డోర్నకల్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్టు వివరించారు. ఎంపీ నామా మాట్లాడుతూ ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ సక్సెస్ చేద్దామని, బీఆర్ఎస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. సంక్రాంతే కాదు..18న జరిగే సభ కూడా మనకు పండుగేనని పేర్కొన్నారు. ఈ సభ దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నదని, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు నాంది పలుకనున్నదని అన్నారు. అంతకుముందు ఖమ్మం నూతన సమీకృత కలెక్టరేట్ సమీపంలో జరిగే బహిరంగ సభాస్థలాన్ని మంత్రి, ఎంపీ పరిశీలించారు.