హైదరాబాద్ : శ్రీశైల దేవస్థానంలో జరుగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (EO Peddiraju) సంబంధిత అధికారులను , సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న కార్తిక మాసం ముగుస్తుందని, ఈ చివరిరోజుల్లో ఆది, సోమవారాల్లో ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
క్యూలైన్లో నిలబడే భక్తులకు తాగునీరు. అల్పాహారం, బిస్కెట్లను అందజేయాలని, అన్నదాన మందిరంలో అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. పుణ్యస్నానాలు చేసే పాతాళగంగలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి, 27న శివముక్కోటి సందర్భంగా ఆయా కైంకర్యాలన్నీ సంప్రదాయబద్ధంగా జరిపించాలని వైదిక మండలికి సూచించారు.
జనవరి మాసంలో 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, జనవరి 14న భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. భోగిరోజున సామూహికంగా చిన్న పిల్లలకు భోగిపండ్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. సంక్రాంతి రోజును మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని, సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేదానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.