హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్లు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మూడు కోట్ల మొక్కలు నాటడమే కేటీఆర్కు పుట్టినరోజు కానుక అని తెలిపారు.
అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవటం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా విలువైనదని ఎంపీ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు 2 కోట్ల 5 లక్షల మొక్కలు, జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు, 142 మున్సిపాలిటీలలో చైర్మన్లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు, అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షల మొక్కలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం కలిపి 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయితీరాజ్ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించినట్లు వెల్లడించారు.