హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రికాషనరీ డోస్ (బూస్టర్ డోస్)కు ఏర్పాట్లు పూర్తి చేశామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సంబంధిత శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభిస్తారని వెల్లడించింది. గతేడాది మార్చి 1వ తేదీ నుంచి వృద్ధులకు టీకాలు ప్రారంభించామని పేర్కొంది. ఏప్రిల్ మూడో లేదా చివరి వారంలో రెండో డోస్ వేశామని తెలిపింది. ఇలా ఏప్రిల్లో రెండో డోస్ వేసుకున్న 60ఏండ్లుపైబడి దీర్ఘకాల వ్యాధులున్న వారు బూస్టర్ డోస్కు అర్హులని వివరించింది.
రాష్ట్రంలో మొత్తం 41.60 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో 8.32 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. వీరందరికీ బూస్టర్డోస్ వేయనున్నారు. డాక్టర్ను సంప్రదించిన తర్వాత, లబ్ధిదారుల సమ్మతితోనే టీకా వేస్తామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు కలిపి రాష్ట్రంలో 6.34 లక్షల మంది ఉన్నారు. హెల్త్కేర్ వర్కర్లకు గతేడాది జనవరి 16వ తేదీన మొదటి డోస్ వేయడం ప్రారంభించారు. వారికి దాదాపు ఫిబ్రవరి మూడోవారం లేదా చివరి వారంలో రెండో డోస్ వేశారు. వారందరికీ ఇప్పుడు ప్రికాషనరీ డోస్ను వేయనున్నారు. అలాగే ఫ్రంట్లైన్ వారియర్లకు గతేడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి టీకాలు వేయడం ప్రారంభించారు. మార్చి మూడో లేదా నాలుగో వారంలో రెండో డోస్ వేసుకున్నారు. మార్చిలో రెండో డోస్ వేసుకున్నవారందరూ ఇప్పుడు మూడో డోస్ వేసుకోవచ్చు.