హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల్లో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతున్నది. కోటి 36 లక్షల పైచిలుకు ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్లో నమోదు కాగా, అందులో దాదాపు మూడు లక్షలు రాష్ట్రం నుంచి ఉండటం విశేషం. ఈ ఎంఎస్ఎంఈల ద్వారా మన రాష్ట్రంలో సుమారు 39 లక్షలమందికి ఉపాధి లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూనే, మరోవైపు వివిధ పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలకు భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ముఖ్యంగా టీఐడియా, టీప్రైడ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా ఆర్థిక సహకారం అందజేస్తున్నది. ఔత్సాహికులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు బ్యాంకర్ల సమన్వయంతో రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గణాంకాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో కొనసాగుతున్న ఉద్యమ్ పోర్టల్లో మన రాష్ట్రం నుంచి తయారీ, సేవల రంగాల నుంచి 2,97,724 పరిశ్రమలు నమోదయ్యాయి. వాటిపై 39, 51,941మందికి ఉపాధి దొరుకుతున్నది.
హైదరాబాద్దే అగ్రస్థానం
హైదరాబాద్తోపాటు దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి తదితర జిల్లాల్లోనే ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 65,114 ఎంఎస్ఎంఈలు ఉండగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 854 మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8,57,807 మందికి ఉపాధి లభిస్తుంటే, ములుగులో కేవలం 4,762 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్కు దూరంగా ఉన్న నారాయణఖేడ్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నిర్మల్ తదితర జిల్లాలు ఎంఎస్ఎంఈల ఏర్పాటులో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే వెనుకబడి ఉన్నాయి.