Aarogyasri | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఆరోగ్య శ్రీ గరిష్ఠ ఇన్సూరెన్స్ను రూ. 15 లక్షలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తమ ప్రభుత్వం ఏర్పడే ముందు ఆరోగ్య శ్రీ పథకం కింద ఇన్సూరెన్స్ రూ. 2 లక్షల వరకు ఉండే. మేం రూ. 5 లక్షలకు తీసుకెళ్లాం. అనంతరం దాన్ని రూ. 10 లక్షలకు పెంచాం. మేం అనుకున్నన్ని మెడికల్ కాలేజీలు పెట్టాం.. అవి విజయవంతంగా కొనసాగుతున్నాయి. 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుంది. వరంగల్లో అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. నాలుగైదు నెలల్లో అందుబాటులోకి రాబోతుంది. ఆరోగ్య వ్యవస్థ పటిష్టం అవుతోంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాబోతున్నాయి. ఇక ఆరోగ్య శ్రీ గరిష్ఠ ఇన్సూరెన్స్ను రూ. 15 లక్షలకు పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. జర్నలిస్టులకు కూడా ఉద్యోగస్తులకు పెట్టిన స్కీం పెట్టాలని నిర్ణయించాం. ఈహెచ్ఎస్ ట్రస్ట్ పెట్టాం. దానికి సీఎస్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కూడా రూ. 15 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తాం. ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పేరు పెట్టారని కేసీఆర్ వివరించారు.