జనగామ, జూన్ 22 (నమస్తే తెలంగాణ)/ఖానాపురం: ఆర్మీ నియామకాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం పేదింట విషం చిమ్మింది. భవిష్యత్తుపై కోటి ఆశలతో కఠోర శ్రమకోర్చి పొందిన శిక్షణ వృథా అవుతుందన్న ఆందోళన, రైల్వేపోలీసులు, కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల ఒత్తిడి ఓ యువకుడిని ఆత్మహత్యాయత్నానికి పురిగొల్పింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన గోవింద్ అజయ్ (22) బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. ఈ నెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లతో తనకు సంబంధం లేకున్నా అందుబాటులో ఉండాలన్న రైల్వేపోలీసుల హెచ్చరికలతో బాధితుడు తనువు చాలించేందుకు సిద్ధపడ్డాడు. రైల్వే పోలీసులు కేసు పెడితే తనకు ఇక ఉద్యోగం రాదేమోనని హైదరాబాద్లో ఉన్న సోదరుడికి చెప్పిన కొద్దిసేపటికే పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు. ప్రస్తుతం అజయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబీకులు తెలిపారు.
ఆదిలాబాద్,(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సోనాపూర్కు చెందిన రాథోడ్ పృథ్వీరాజ్ను ఏ-2గా చేర్చారు. పృథ్వీరాజ్ డిగ్రీ చదివి ఆర్మీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. పలుసార్లు అర్హత పరీక్షకు హాజరయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకొని హైదరాబాద్కు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. అల్లర్లలో పాల్గొన్నట్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి ఘటనలో మరో 10 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 45 మందిని అదుపులోకి తీసుకొన్నారు. అరెస్టయిన వారిలో ముగ్గురు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, రైల్లో మంటలు అంటించిన పృథ్వీరాజ్ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇద్దరు డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం.
సికింద్రాబాద్ కాల్పుల్లో ఆర్మీ అభ్యర్థి రాకేశ్ మృతి.. ముమ్మాటికి కేంద్రం హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నారాయణ దబీర్పేటలో రాకేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.