హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సమయం సమీపిస్తున్నది. ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. మంగళవారం హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం హైదరాబాద్ పరిధి పోలీస్ కమిషనర్లు, అధికారులతో సమావేశమయ్యారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలని సూచించారు. హైదరాబాద్తోపాటు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
నోటిఫికేషన్లన్నీ యథాతథం
ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచింది. అప్పటినుంచి ప్రస్తుత నోటిఫికేషన్లు కొనసాగిస్తారా? లేక వాటికి కొత్త రిజర్వేషన్లు వర్తింపజేస్తారా? అనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది. అయితే.. ఇప్పటివరకు వెలువడిన 22, 594 పోస్టులకు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా ఇవ్వబోయే నోటిఫికేషన్లకు మాత్రం 10 శాతం గిరిజన రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. ఇందుకు వారంలో కొత్త రోస్టర్ను సిద్ధం చేయనున్నారు. ఇప్పటివరకు ప్రతి వందలో 8, 25, 33, 58, 75, 83 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేసి ఈ లెక్కన ఉద్యోగాలను కేటాయించారు.
9 నుంచి హాల్టికెట్లు
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు 1,040 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
హాల్టికెట్లను ఈ నెల 9 నుంచి https://www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. 503 గ్రూప్ 1 పోస్టులకు మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఒకో పోస్టుకు సగటున 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 దరఖాస్తులు రాగా, ఒకో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు.