జగిత్యాల, జనవరి-19 : కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం మంత్రి జూమ్ వీడియో సమావేశం ద్వారా రెండో డోస్ వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, రెండు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు.
కరోనా విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కరోనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా ఉందన్నారు. ఎవరు కూడా కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
సమావేశంలో జగిత్యాల జడ్పీ చైర్మన్ దావ వసంత , జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.