హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, కేవలం ఒక అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ తప్పుడు కేసులు పెట్టి, అదుపులోకి తీసుకున్నాయని ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఈ కేసుల్లో బెయిలు మంజూరు చేయాలని కోరడంతోపాటు తన అరెస్టు కోసం సీబీఐకి దిగువ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని, కస్టడీని సవాలు చేస్తూ కవిత వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ సోమవారం దాదాపు 45 నిమిషాలపాటు సుదీర్ఘ విచారణ జరిపారు.
కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదన వినిపిస్తూ.. సీబీఐ, ఈడీ విచారణకు కవిత సహకరించినప్పటికీ ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని ఆక్షేపించారు. ఈ కేసుల్లో సహ నిందితులుగా ఉన్న శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డికి బెయిల్ లభించిందని, ఆ తర్వాత వారు అప్రూవర్లుగా మారి కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి శరత్చంద్రారెడ్డి రూ.55 కోట్లు చెల్లించారని, మాగుంట రాఘవ తండ్రి శ్రీనివాస్రెడ్డి (ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాలతో కవితను కలిశానని వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి) ఎన్డీఏ తరఫున ఏపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని వివరించారు.
కవిత విషయంలో మహిళల హక్కులను కాలరాసేలా దర్యాప్తు అధికారులు వ్యవహరించారని, దీంతో మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సీఆర్పీసీలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. దీనిపై విచారణ సందర్భంగా కవితపై కఠిన చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు ఈడీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే ఆమెను ఈ కేసులో నిందితురాలిగా పేరొంటూ సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్ కింద సమన్లు జారీ చేశారని, అప్పటివరకు సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా ఎందుకు మార్చారో తెలియదని అన్నారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగుతుండగానే ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు ఆమె ఇంటిలో ఉన్నారని, నిబంధలకు విరుద్ధంగా అదే రోజు ఆమెను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. అన్ని వివరాలను పరిశీలించి ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవిత విచారణ, అరెస్ట్ విషయాల్లో సీబీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని విక్రమ్ చౌదరి వాదించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కవితను సీబీఐ ప్రశ్నించాలంటే ఆమె వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదని, అదేమీ లేకుండానే కవితను విచారించేందుకు దిగువ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. కవితను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నించిందని, కనీసం తమకు అప్లికేషన్ కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మరుసటి రోజు స్పెషల్ జడ్జి విచారణ జరిపి కవిత అరెస్ట్కు ఆదేశాలు ఇచ్చారంటూ విక్రమ్ చౌదరి తన వాదనలను ముగించారు. దీంతో సీబీఐ, ఈడీ మంగళవారం తమ వాదనలు వినిపించనున్నాయి. అందుకు మధ్యాహ్నం 12 నుంచి 1.15 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తున్నట్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయడాన్ని సవా ల్ చేస్తూ నిందితుడు అరుణ్ రామచంద్ర పిైళ్లె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 16న హైకోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వులను కొట్టివేయాలని కోరా రు. హైకోర్టు ఉత్తర్వులను తాము పరిగణనలో కి తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
కవిత తరఫున ఢిల్లీ హైకోర్టలో విక్రమ్ చౌదరి వాదించిన తీరును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఈ కేసులో తాము ఇచ్చే తీర్పు ఎలా ఉన్నప్పటికీ విక్రమ్ చౌదరి చాలా చక్కగా వాదనలు వినిపించారని జడ్జి అభినందించారు. మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు ముగిశాక కవిత పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేస్తామని, జూలైలో కోర్టు సెలవుల కంటే ముందే ఆ తీర్పును వెలువరిస్తామని జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు.