హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయా? అన్నింటికి కలిపి ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. తద్వారా కార్పొరేషన్ల పనితీరు మరింత మెరుగుపరచాలని భావిస్తున్నట్టు సమాచారం.
కార్పొరేషన్ల నిర్వహణను కూడా విభజన చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. ఒక్కో కార్పొరేషన్ను ఒక్కో ఎండీని కాకుండా అన్నింటికి కలిపి ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం తెలిసింది. వ్యవసాయరంగానికి అనుబంధంగా ఆగ్రోస్, మార్క్ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, గిడ్డంగుల కార్పొరేషన్, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవి పంట ఉత్పత్తుల కొనుగోలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల క్రయ విక్రయ వ్యాపాలు నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు మార్కెటింగ్ సంస్థ కార్పొరేషన్ల మాదిరిగానే పలు పనులను చేస్తున్నది.
ఇందులో కొన్ని కార్పొరేషన్లు ఒకే పనిని చేస్తున్నాయి. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్ బంకులు, గోదాముల నిర్వహణను రెండు మూడు కార్పొరేషన్లు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కార్పొరేషన్లు తమకు సంబంధంలేని పనులను చేస్తున్నాయనే విమర్శలున్నాయి. దీనిపై అభ్యంతరం తెలిపిన ప్రస్తుత ప్రభుత్వం.. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లు రైతులకు మేలు చేసే పనులు చేయాలే తప్ప ఇలాంటి కమర్షియల్ పనులు చేయడమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ భూములను వ్యవసాయ అనుబంధ పనుల కోసం వినియోగించాలని సూచించినట్టు సమాచారం. ఏ అర్హత గల సంస్థ అవే పనులు చేయాలని, ఆ మేరకు పనులను విభజించాలని భావిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.