వేములవాడ/మల్యాల, ఏప్రిల్ 4: వేములవాడ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యులతోపాటు కాకతీయ వైభవం ఉట్టిపడేలా రాజన్న ఆలయ అభివృద్ధి నమునాలను రూపొందిస్తామని యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి తెలిపారు. సోమవారం వైటీడీఏ(యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) వైస్ చైర్మన్ కిషన్రావు, వీటీడీఏ (వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) వైస్చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి, యాదాద్రి మరో ఆర్కిటెక్ట్ ముక్తీశ్వర్తో కలిసి ఆయన వేములవాడ క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీరాజరాశ్వేరస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను మూడు గంటలపాటు కలియదిరిగారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్, ప్రధాన ఆర్చకులు శరత్తో మాట్లాడి ఆలయ విశిష్ఠత, ప్రాశస్త్యాన్ని తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ఆనంద్సాయి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. భక్తులకు వసతి సౌకర్యాలతోపాటు ఆలయ విశిష్ఠతను పెంపొందించే విధంగా నమునాలను సిద్ధంచేసి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రితో కలిసి ఆలయాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలోని నగరేశ్వర ఆలయంలో ఉత్తరాది శిల్పసౌందర్యం కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. అనంతరం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఆయా కార్యక్రమాల్లో వేములవాడ, కొండగట్టు ఆలయ ఈవోలు రమాదేవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.