మహబూబాబాద్ జిల్లాలో గుర్తించిన పురావస్తు పరిశోధకులు
హైదరాబాద్, మార్చి 13 : మహబూబాబాద్ జిల్లాలో 3,500 ఏండ్ల నాటి స్మారక శిలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఈ శిల సామాన్య శకానికి పూర్వం 1,500 సంవత్సరం(ఇనుప యుగం) నాటిది అని ఆయన వెల్లడించారు. వారసత్వ సంపద గురించి స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం ఆయన మరిపెడ మండలంలో పర్యటించారు. ఈ క్రమంలో బీచురాజుపల్లి గ్రామపరిధిలోని ఎల్లారిగూడెం బస్టాండ్ సమీపంలో 6 అడుగుల ఎత్తు, 3 అడుగుల మందంతో తెలుపురంగులోని గ్రానైట్ జాతి నిలువురాతిని గమనించారు. దీనిపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ను సంప్రదించగా అది ఇనుపయుగపు మెన్హిర్ (స్మారకశిల) అని నిర్ధారించారని, జీఎస్ఐ పూర్వసంచాలకుడు డాక్టర్ కమతం మహేందర్రెడ్డి.. దీని వయసు 3,500 సంవత్సరాలు ఉంటుందని చెప్పినట్టు వెల్లడించారు. ఇనుప యుగంలో మరణించిన వారి సమాధి దగ్గర ఇలాంటి నిలువురాతిని పాతిపెట్టే సంప్రదాయం ఉన్నదని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్మారక శిల చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, భవిష్యత్తు తరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.