నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 18: రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాలకు పండుగ తెచ్చింది. భారీగా నిధుల కేటాయింపులతో సంబురం నింపింది. కరోనా కష్ట కాలంలోనూ అన్ని రంగాలకు నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులపై సంతోషం తెలుపుతూ ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు చాలాచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. వ్యవసాయానికి పెద్దపీట వేయడంపై రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం, షీ టాయిలెట్స్, సమగ్ర భూసర్వే ఇలా ఎన్నో కొత్త పథకాల కోసం నిధులు కేటాయించడంపై సంబురపడుతున్నారు. వనపర్తి జిల్లాకేంద్రానికి సమీపంలోని రాజనగరం గ్రామ శివారులో పచ్చని పంట పొలాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చిత్రపటాలను రైతులు క్షీరాభిషేకం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు జెడ్పీటీసీల ఫోరం ప్రధానకార్యదర్శి ఉమ్మనగారి మనోహర్రెడ్డి సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
బడ్జెట్లో ఆర్టీసీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 48 వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని ఆర్టీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. టీఎంయూ నాయకుడు థామస్రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు గురువారం ఆర్టీసీ భవన్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీకి బడ్జెట్ కేటాయింపులపై నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి ఈ అశోక్, టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్-1, 2 డిపోలతోపాటు హుజూరాబాద్, జగిత్యాల, గోదావరిఖని, సిరిసిల్ల, వేములవాడ, మెటపల్లి, కోరుట్ల, మంథని డిపోల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్, మంత్రులు పువ్వాడ, జగదీశ్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.