హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి ఐకాన్గా మారిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. తొమ్మిదేండ్ల కాలంలోనే కనీవినీ ఎరుగని పురోభివృద్ధి సాధించిందని కితాబిచ్చారు. తన 34 ఏండ్ల సర్వీసులో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గతంలో చూడలేదని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో సీఎస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శనికత, ముందుచూపుతో రాష్ట్ర అన్నిరంగాల్లో రికార్డు స్థాయిలో పురోగమించిందని తెలిపారు.
నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా అన్నింటా అద్భుతమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో అంతా కండ్లముందే కనిపిస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, వాటర్ ట్యాంకుల కోసం కూడా పెద్దఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు.. తెలంగాణలోని ఏ పల్లెలోనూ అటువంటి పరిస్థితి లేదని చెప్పారు.