హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో.. దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి గంటకు 4 వేల చొప్పున దరఖాస్తులను సమర్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 3,21,704 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇవాళ రాత్రి 12 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది.
సోమవారం వరకు 2,94,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు 27,060 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సంఖ్య 40 వేలకు పైగా చేరుకునే అవకాశం ఉంది. మొత్తంగా 503 గ్రూప్-1 పోస్టులకు 3 లక్షల 50 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.