Telangana | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ పరిధిలో 1,520 మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి బుధవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. అభ్యర్థులు తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన లేదా తెలంగాణ పారామెడికల్ బోర్డులో నమోదైన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) ఫిమేల్ కోర్సు పూర్తి చేయాలి. లేదా వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చదివి, ప్రభుత్వ దవాఖానలో ఏడాది పాటు క్లినికల్ శిక్షణ పూర్తిచేసినవారు లేదా ప్రస్తుతం కొనసాగుతున్న వారు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు.
అభ్యర్థులు 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసు వారై ఉండాలి. వివిధ క్యాటగిరీలకు సడలింపు ఇస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.31,040 నుంచి రూ.92,050 వరకు వేతనం చెల్లించాలని నిర్ణయించారు. పరీక్షలో మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. 100 మార్కుల పేపర్కు 80 మార్కులకే పరీక్ష రాయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి 20 మార్కులు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసినవారికి ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, ఇతర ప్రాంతాల్లో పనిచేసినవారికి ప్రతి ఆరు నెలలకు 2 పాయింట్లు కేటాయిస్తారు. పరీక్ష ఇంగ్లిష్లో నిర్వహిస్తారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. వివరాలకు mhsrb.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 1,520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి.
– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు