BJP | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీజేపీలో టికెట్ కోసం దరఖాస్తులు ఓ దండగ వ్యవహారంలా తయారైందని స్వయం గా పార్టీ నేతలే వాపోతున్నారు. పేరుకు 6వేల మంది దరఖాస్తు చేసినా.. ముఖ్య నేతలంతా ముఖం చాటేయడంపై పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది. బీజేపీ ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల్లో రఘునందన్రావు మినహా ఎవరూ టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి మినహా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు దాదాపు అందరూ దరఖాస్తుకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎందుకు దరఖాస్తు చేయలేదు? ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీ చేయరా? అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి నేతలు చేసిన సవాళ్లు ఉత్తివేనా? మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి వంటివాళ్లు పోటీకి దూరంగా ఉంటున్నారా? ప్రచారంలో ఉన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి నేతలు జంప్ అవుతారా? అని చర్చించుకుంటున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాబట్టి ఆయన దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఆ నియోజకవర్గం నుంచి విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాజాసింగ్ను కాదని టికెట్ కేటాయిస్తారా అనే చర్చ మొదలైంది.
పార్టీలో తమకున్న పరపతి దృష్ట్యా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలా? అని ముఖ్యనేతల అహం దెబ్బతిన్నదని, అందుకే దూరంగా ఉన్నారని చర్చ నడుస్తున్నది. ‘మా నియోజకవర్గంలో మాకు కాకుండా ఇంకెవరికి టికెట్లు ఇస్తారు?’ అనే ధీమాలో వారు ఉన్నారు. దీం తో ముఖ్యనేతలకు చెందిన నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్న ఇతర నేతలకు టికెట్లు కేటాయిస్తారా? అని దరఖాస్తుదారులు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ దరఖా స్తు చేయకపోయినా ఈటల, ధర్మపురి అర్విం ద్, బండి సంజయ్ వంటి నేతలకు టికెట్లు ఇస్తారా? అని అడుగుతున్నారు. ఒకవేళ ఇస్తే దరఖాస్తుల ప్రక్రియ మొత్తం దండగ వ్యవహారమవుతుందని, 6 వేల మందిని మోసం చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చినా.. దరఖాస్తు ఇవ్వలేదు కాబట్టి టిక్కెట్ ఇచ్చేదే లేదని చెప్పగలరా అని అడుగుతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాం డ్ చేస్తున్నారు. వాస్తవానికి సుమారు 30-40 నియోజకవర్గాలకు టికెట్లు ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయం అయిపోయిందని చెప్పుకుంటున్నారు. మిగతా 80-90నియోజకవర్గాల్లో ఎంత వెతికినా పోటీచేసే నేతలు దొరకడం లేదని, అందుకే దరఖాస్తుల పేరుతో నాటకం ఆడారన్న వాదనలు వినిపిస్తున్నాయి.