Liquor Shops | హైదరాబాద్ : మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక అక్టోబర్ 23వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు.
2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు అంటే రెండేళ్ల కాలానికి అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ. 3 లక్షలుగా నిర్ధారించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు.
ఇక మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేశారు అధికారులు.