సాగర్లో తాగునీటిని కాపాడే బాధ్యత మాకూ ఉంది
నీటి యాజమాన్యం తెలియకే కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్/ సూర్యాపేట, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చిల్లర రాద్ధాంతం చేస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నీటి యాజమాన్యం తెలియకనే నదీ జలాలపై ఏపీ చీటికిమాటికి కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కు ఫిర్యాదు చేస్తున్నదని ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తి చేయడంలేదని తెలిపారు. అయితే, విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో గ్రిడ్కు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందని, అందుకోసం ఐదు నుంచి పది నిమిషాలపాటు ఉత్పత్తిచేసి తర్వాత నిలిపేయడం సాధారణమేనని చెప్పారు.
ఇలాంటి సమయాల్లోనూ అసంబద్ధ ఆరోపణలు చేసి ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని దిగజార్చుకుంటున్నదని అన్నారు. తాగునీటి కోసం నాగార్జునసాగర్లో నీటిని కాపాడుకొనే బాధ్యత తమపై ఉన్నదని చెప్పారు.విద్యుత్తు ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ నీటిని వినియోగించకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఫిర్యాదుచేశారు.