హైదరాబాద్, ఫిబ్రవరి26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్ మెయింటనెన్స్ పనులపై ఏపీ సర్కార్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. తమ వైపు డ్యామ్కు సంబంధించి మరమ్మతు పనులు తామే చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్కు లేఖ రాసింది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన తాత్కాలిక ఒప్పందం మేరకు నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణ, శ్రీశైలం డ్యామ్ నిర్వహణ, మెయింటనెన్స్ను ఏపీ సర్కారు చూడాల్సి ఉన్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే రూ.20 కోట్లతో నాగార్జునసాగర్ డ్యామ్లో మరమ్మతులు చేపట్టింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ సర్కార్ అక్రమంగా సాగర్ డ్యామ్ వద్ద సాయుధ బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డ్యామ్ను తన ఆధీనంలోకి తీసుకున్న కేఆర్ఎంబీ.. ఏమైనా మరమ్మతులు చేయాలంటే తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ అనుమతితో మరమ్మతు పనులను పునఃప్రారంభించింది. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ తాజాగా మరో మెలిక పెట్టింది. ఏపీ భూభాగంలో ఉన్న డ్యామ్కు మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులను తామే చేసుకుంటామని కేఆర్ఎంబీకి లేఖ రాసింది. పదమూడు గేట్లను, కుడికాలువ హెడ్ రెగ్యులేటరీని మార్చి ఒకటి నుంచి ఆపరేట్ చేసేందుకు తమ ఇంజినీర్లను, సహాయక సిబ్బందిని అనుమతించాలని, ఆ మేరకు సీఆర్పీఎఫ్కు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తో కంగుతిన్న కేఆర్ఎంబీ అధికారులు త్వరలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి, అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్జీవన్ పాటిల్
తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ప్రశాంత్జీవన్ పాటిల్ సోమవారం సెక్రటేరియట్లో బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఈఎన్సీ జనరల్ అనిల్కుమార్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన ఎర్రమంజిల్లోని జలసౌధను సందర్శించారు.
గాలికి వదిలేసిన సర్కారు
నాగార్జునసాగర్ డ్యామ్ను స్వాధీనం చేసుకునే అంశాన్ని తెలంగాణ సర్కారు పూర్తిగా గాలికి వదిలేసింది. డ్యామ్ పై ఏపీ సర్కార్ దురాక్రమణకు పాల్పడి మూడు నెలలు గడుస్తున్నా రేవంత్ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించలేదు. ఏపీ స్వాధీ నం చేసుకున్న డ్యామ్ భూభాగాన్ని తిరిగి తెలంగాణకు స్వాధీనం చేయాలన్న డిమాండ్ను కేంద్రం ముందు పెట్టడడం లేదు. అందుకు విరుద్ధంగా డ్యామ్తోపాటు, పలు ఔట్లెట్లను కూడా కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధపడింది. తెలంగాణవాదు లు, ఇంజినీర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని స్పష్టం చేసింది. కానీ ఏపీ స్వాధీనం చేసుకున్న కుడికాలువ, గేట్ల ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.