మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది. కారణం… పేరుగొప్ప జాతీయ పార్టీల్లోనూ, అధికారం కోసం కొట్లాడుకుంటున్న రాష్ట్ర పార్టీల్లోనూ ఇప్పుడెక్కడా ఆంధ్రప్రదేశ్ చర్చ జరగడం లేదు. ఆంధ్రా ప్రజల ప్రయోజనాల ప్రస్తావన ఊసే ఉండటం లేదు.
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం, రాజధాని హైదరాబాద్
అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నదని, 8 ఏైండ్లెనా రాజధాని ఇంకా అగమ్యగోచరంగానే ఉన్నదని, జాతీయ ప్రాజెక్టు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, ఇక రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అక్కడి మేధావులు వాపోతున్నారు.
పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగుదేశం రెండూ ఏపీ ప్రయోజనాల గురించి ఆలోచించకుండా బీజేపీ ముందు సాగిలబడటానికి పోటీపడటం ఆంధ్రా పౌరులను విస్మయపరుస్తున్నది. ‘సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం అని ఉంటాయి. మిత్రపక్షం, వైరి పక్షం అని ఉంటాయి. మా దగ్గర ఎవరు ఎవరికి మిత్రపక్షమో తెలియడం లేదు. ఒకరు అన్యాయం చేస్తే.. మరొకరైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడతారు. కానీ మా రాష్ట్రంలో వింత పరిస్థితి.
ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగుదేశం రెండూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షాలే. జనసేనాని సంగతి సరేసరి. ఇక మా గోడు గురించి అడిగేదెవరు?’ అన్నది సగటు ఏపీ పౌరుడు వేస్తున్న సూటి ప్రశ్న. ‘మండుతున్న ధరలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రజాస్వామ్య హననం, రాష్ర్టాల హక్కుల ఉల్లంఘన, మోదానీ అక్రమాలు.. ఇలా అనేక అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి. సంయుక్తంగా పార్లమెంటులో పోరాడుతున్నాయి.
కదం కదం కలిపి ధర్నాలు చేస్తున్నాయి. రాష్ట్రపతికి నివేదిస్తున్నాయి. కలసికట్టుగా సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రా పార్టీలను కానీ, నేతల్ని కానీ, ఎంపీలను కానీ పట్టించుకున్నవారు లేరు. మాతో వస్తారా.. అని మాటవరుసకు పలకరించిన వారు లేరు. జాతీయ రాజకీయాల్లో ఏపీ పూర్తిగా మార్జినలైజ్ అయిపోయినట్టు కనిపిస్తున్నది’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలా ఉండగా, ఆంధ్రాకు చెందిన రెండు ప్రధాన పార్టీల నేతలూ మోదీ- అమిత్షా కరుణా కటాక్ష వీక్షణాల కోసం పోటీ పడుతుండడం వింతగా, విడ్డూరంగా కనిపిస్తున్నదని కూడా ఆయన అన్నారు.
ఎవరి లాభం కోసం జగన్, చంద్రబాబు ఇలా దేబిరిస్తున్నారో అర్థం కావడం లేదని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. ‘జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తి కాలేదు. పోర్టులు అన్యాక్రాంతమవుతున్నాయి. విశాఖ ఉక్కుపై ప్రైవేటు కత్తి వేలాడుతున్నది. ప్రజల ప్రయోజనానికి విరుద్ధమైనా విద్యుత్తు సంస్కరణల అమలుకు ఒప్పుకుంటున్నారు. మోదీ-షా ఏది చెప్తే దానికి డూడూ బసవన్నల్లా తలలూపుతున్నారు. ఒక్కరూ నోరు మెదిపే పరిస్థితి లేదు. ఎవరి కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల చెంత తాకట్టుపెడుతున్నారో అర్థం కావడం లేదు’ అని ఏపీ రాజకీయాలను కాచి వడబోసిన సీనియర్ నేత ఒకరు ఆవేశపడ్డారు. ‘ఇప్పుడు మాకు అధికారపక్షం, ప్రతిపక్షం లేవు. ఉభయపక్షాలూ బీజేపీ చంకనెక్కాయి. రాష్ర్టాన్ని బీజేపీయే రిమోట్తో పరిపాలిస్తున్నట్టుంది’ అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.