హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకత్వం లేదని, అక్కడ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఏపీ బీఆర్ఎస్ నేత ఆదినారాయణ అన్నారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆదినారాయణ మీడియాతో మాట్లాడారు. ‘పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున ఏపీ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్లో చేరడానికి వచ్చాం.
తెలంగాణ తరహాలో ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి అక్కడి నేతల చేతకానితనమే కారణం. ఇందుకే మాకు కేసీఆర్ లాంటి నేత కావాలి. మనసావాచాకర్మణా బీఆర్ఎస్ను ఏపీలో ప్రతి గ్రామంలోని రైతు వద్దకు తీసుకెళ్తాం. ఈ మేరకు కేసీఆర్ మాకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. రైతును అమ్ముకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే.. అదే రైతును కేసీఆర్ నమ్ముకున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కా ర్, కిసానోంకి తారా కేసీఆర్ అంటూ దేశం మొత్తం నినాదాలు హోరెత్తుతున్నాయి’ అని ఆదినారాయణ పేర్కొన్నారు.