యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ జన్మ ధన్యమైందని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా శనివారం స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖమండపంలో వేద ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఏపీలో సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి బారినపడ్డ తమ కుటుంబ సభ్యులు లక్ష్మీనృసింహస్వామి దయతో బయటపడ్డామన్నారు.