నీరాను ప్రభుత్వమే ప్రమోట్ చేసి, ప్రత్యేకంగా కేఫ్ పెట్టిన కేసీఆర్ సర్కారుకు ధన్యవాదాలు. ఈ నీరా స్ఫూర్తిని ఏపీలోనూ అమలు చేస్తాం. జగనన్నతో ఈ విషయం గురించి చర్చిస్తాం. ఇక్కడ చూపిన మార్గదర్శకాలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం.. చర్చిస్తాం. అక్కడ కూడా బలహీన వర్గాలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తాం.
– జోగి రమేశ్
Neera Cafe | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ‘నీరాను రుచి చూశాం.. చాలా అద్భుతంగా ఉన్నది. నీరాను మార్కెటింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలతో కులవృత్తులకు పెద్దపీట వేశారు’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ ప్రశంసించారు. మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్, సినీ నటుడు సుమన్తో కలిసి ఆయన నీరా కేఫ్ను సందర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ‘నీరాను ప్రభుత్వమే ప్రమోట్ చేసి, ప్రత్యేకంగా కేఫ్ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
ఈ నీరా స్ఫూర్తిని ఏపీలోనూ అమలు చేస్తాం. ఇప్పటికే బలహీనవర్గాలకు, గౌడకులస్థులకు పెద్దపీట వేస్తున్న జగనన్నతో ఈ విషయం గురించి చర్చిస్తాం. ఇక్కడ చూపిన మార్గదర్శకాలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం.. చర్చిస్తాం. అక్కడ కూడా బలహీన వర్గాలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తాం’ అని తెలిపారు. నీరా ఒక మహా ఔషధం, దీని ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర భుత్వం గుర్తించిందని చెప్పారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని నీరాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని, ఆయన గౌడజాతి ఆణిముత్యం అంటూ అభివర్ణించారు. నీరాకేఫ్లో తాటిముంజలు అ మ్ముకునేలా చర్యలు తీసుకోవాలని, ఔత్సాహికులు ముందుకొస్తే ప్రోత్సహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూచించారు.
తెలంగాణలో కుల వృత్తులను గౌరవించేలా సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులను అం దరూ అభినందించాల్సిందేనని సినీ నటుడు సుమన్ చెప్పారు. నీరా చాలా సూపర్గా ఉన్నదని, అన్ని స్టాల్స్లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలున్నాయని మెచ్చుకున్నారు. కెమికల్ డ్రింక్స్ కంటే స్వచ్ఛమైన నీరా ఉత్తమమని, నీరా కేఫ్ను హెల్దీ రెస్టారెంట్గా తీర్చిదిద్దే ఆలోచన చేయడం అభినందనీయమని తెలిపారు. దేశం మొత్తం నీరా కేఫ్ల కాన్సెప్ట్ అవసరమని, నీరాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్, మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్, దర్శకుడు పీ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.