ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి అమెరికా నుంచి నెల్లూరు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన విషయం విదితమే. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సొంత జిల్లా నెల్లూరుకు అధికారులు తీసుకువచ్చారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు.
గౌతమ్ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో నెల్లూరులోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. తమ ప్రియతమ నాయకుడి చివరి చూపుకోసం వారంతా అక్కడికి చేరుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన గౌతమ్ రెడ్డి తనయుడు కృష్ణార్జున రెడ్డి తన తండ్రి మృతదేహాన్ని చూసి విలపించాడు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంతక్రియలు ఉదయగిరి మెరిట్ కాలేజీలో జరగనున్నాయి. అంతక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.