హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగంపై ఏపీ మళ్లీ అదే వితండవాదాన్ని కొనసాగిస్తున్నది. ఏకంగా బోర్డు మీటింగ్లో అంగీకరించిన అంశాన్ని తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నది. బోర్డు మీటింగ్ మినిట్స్నే సవరించాలని కోరుతున్నది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు బుధవారం లేఖ రాసింది. ఏపీ పునర్విభజన సమయంలో ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై ఏడాది పరిమితితో తాత్కాలిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 66ః34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయి. ఏడాది కాలానికి చేసుకున్న ఒప్పందాన్నే కేంద్రం ఏటికేడు పొడిగిస్తూ వస్తుండగా, నిరుటి నుంచి తెలంగాణ మాత్రం అందుకు ససేమిరా అంటున్నది.
ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యేంత వరకూ 50ః50 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను వినియోగించుకుంటామని 16వ బోర్డు మీటింగ్తోపాటు, ఇటీవల నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్లోనూ తెలంగాణ ఖరాకండిగా తేల్చిచెప్పింది. దీంతో అంశాన్ని కేంద్ర జల్శక్తిశాఖ దృష్టికి తీసుకెళ్తామని కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. అందుకు ఏపీ అభ్యంతరం తెలిపినా బోర్డు మాత్రం కేంద్రానికి నివేదిస్తామని స్పష్టం చేసింది. 17వబోర్డు మీటింగ్ మినిట్స్లోనూ ఈ విషయం పొందుపరచింది. ఇప్పుడు ఏపీ మాత్రం ఆ మీటింగ్ మినిట్స్నే మార్చాలని బోర్డుకు లేఖ రాయటం గమనార్హం. గతంలోని తాత్కాలిక ఒప్పందాన్నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించిందని, ఆ మేరకు మినిట్స్ను సవరించాలని కోరింది.
పాలమూరు-రంగారెడ్డికి అనుమతి ఇవ్వొద్దు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపడుతున్నదని, వెంటనే అడ్డుకోవాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) ఏపీ కోరింది. ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించవద్దని విజ్ఞప్తి చేసింది. కృష్ణా బేసిన్లో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్, కృష్ణాబోర్డు అనుమతి అవసరమని, ఇవేమీ లేకుండానే పాలమూరు-రంగారెడ్డి చేపడుతున్నారని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.