హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019లో ఏపీ రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, 2023 బడ్జెట్ అంచనా ప్రకారం అవి రూ.4,42,442 కోట్లుగా ఉన్నాయి.
ఏపీ సర్కారు ఏటా సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తున్నదని పంకజ్ చౌదరి వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తీసుకున్న రుణాల మొత్తం రూ.55 వేల కోట్లకు చేరింది. గడిచిన 9 నెలలుగా ప్రభుత్వం చేసిన రుణం ఎఫ్ఆర్బీఎం పరిమితులను మించి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.