అమరావతి : ఏపీ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీ అధికారులను జైలుకు పంపొచ్చా అంటూ వ్యాఖ్యానించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్టీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఫొటోలను పరిశీలించింది. ఇంకా కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పరిశీలన నివేదిక అందలేదని తెలిపింది. ఏపీ జరిపిన పనులపై తెలంగాణ ప్రభుత్వం ఫొటోలు సమర్పించింది. చాలా వరకు పనులు పూర్తి చేశారని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించింది.
ఏపీ చీఫ్ సెక్రటరీ కోర్టుకు అబద్ధాలు చెబుతున్నారని, కేఆర్ఎంబీ నివేదికలో పనులు జరిగినట్లు ఫొటోలతో సహా పేర్కొన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక సమర్పించకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్లో ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. ఏపీతో కుమ్మక్కయ్యారా.! అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోటోలు పరిశీలిస్తే పనులు ఎక్కువగానే జరిగినట్లు తెలుస్తున్నదని ధర్మసనం పేర్కొంది. నివేదిక అందకుండా ఆదేశాలు ఇవ్వలేమని ఎన్జీటీ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆ లోపు నివేదికలు, అభ్యంతరాలు సమర్పించాలని ఆదేశించింది.