హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వానికి సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం ఉదయం విజయవాడలోని ఎన్జీవో నివాసంలో, సాయంత్రం సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశమైన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి, ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. అనంతరం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మను కలిసి, ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయని, 12 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. తాము సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని, ఇందుకు సమయం ఇవ్వాలని సీఎస్ను కోరారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, మళ్లీ సవరించిన వేతన స్కేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5 నుంచి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ, 7 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు, 26న తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, 27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం తాము వేతన బిల్లులను ప్రాసెస్ చేయబోమని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ట్రెజరీ డైరెక్టర్కు లేఖ రాసింది. మరోవైపు పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు శుక్రవారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.