Pawan Kalyan | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.5.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.
అనంతరం నాచుపల్లి శివారులోని బృందావనం రిసార్ట్స్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. సమావేశాల తర్వాత పవన్ కల్యాణ్ హైదరాబాద్ తిరుగుప్రయాణం కానున్నారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఇదే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో చర్చించారు. ఈ క్రమంలో కొండగట్టు అభివృద్ధి పనులకు రూ.35.19 కోట్ల మంజూరుకు టీటీడీ అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు.