గ్యాస్ మాస్క్తో తగ్గనున్న పురిటి నొప్పులు
కింగ్ కోఠి దవాఖానలో అందుబాటులో
హాస్పిటల్లో 80% నార్మల్ డెలివరీలే
సుల్తాన్బజార్, మే 25: పురిటి నొప్పులను తగ్గించి సాధారణ ప్రసవాలు చేసేందుకు ఎంటోనాక్స్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రసవ సమయంలో గర్భిణులకు వచ్చే నొప్పులను తగ్గించేందుకు ఎంటోనాక్స్ గ్యాస్ సిలిండర్, మాస్క్ దోహదం చేస్తాయని అంటున్నారు. ఈ టెక్నాలజీని కింగ్ కోఠి దవాఖానలో వినియోగిస్తున్నట్టు దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెనికోలా తెలిపారు. 2019 నుంచి ఈ సేవలను వినియోగిస్తున్నామని, అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు నిలిపి వేశామని, ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. పురిటి నొప్పులు ఎక్కువయ్యే సమయంలో ఎంటోనాక్స్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ను పీలిస్తే రెండు నిమిషాల పాటు నొప్పులు తగ్గి ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఈ టెక్నాలజీని విదేశాల్లో ఎక్కువగా వాడుతున్నారని, ఇక్కడ కూడా ప్రైవేట్ దవాఖానల్లో వాడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రసవాల కోసం పేద మహిళలు ప్రభుత్వ దవాఖానలనే ఆశ్రయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గర్భిణులకు ఉపశమనం
ప్రసవాల సమయంలో గర్భిణులు పడే నొప్పుల నుండి ఉపశమనం కలిగించేందుకు ఎంటోనాక్స్ మాస్క్ ఎంతగానో దోహదం చేస్తుంది. దవాఖానలో 2019లోనే ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చాం. కరోనా వల్ల నిలిచినా, ప్రస్తుతం తిరిగి ప్రారంభించటం సంతోషంగా ఉన్నది.
–డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్,
కింగ్ కోఠి దవాఖాన
దవాఖానలో 20 శాతమే సిజేరియన్
దవాఖానలో 20 శాతమే సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. ఎక్కువగా సాధారణ ప్రసవం చేయటానికే మొగ్గు చూపుతున్నాం. దాని కోసం వారితో వ్యాయామం చేయిస్తున్నాం. ప్రత్యేకంగా బాల్ ఇతర క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచాం. గతం కంటే ప్రస్తుతం నార్మల్ డెలివరీలు అధికమయ్యాయి. – డాక్టర్ జలజ వెనికోలా, అడిషనల్ సూపరింటెండెంట్, కింగ్ కోఠి దవాఖాన