న్యూఢిల్లీ, మే 12: ప్రభుత్వ విభాగాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఫిర్యాదుల స్వీకరణ, విచారణ కమిటీలు లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా, పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్ ఏఎస్ బోపన్న, హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోవా వర్సిటీ మాజీ హెచ్వోడీ అరెలియానో ఫెర్నాండేజ్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చి చాలా కాలమైన తర్వాత కూడా అమలులో తీవ్రమైన లోపాలు ఉండటం విస్మయానికి గురిచేస్తున్నదని వ్యాఖ్యానించింది. ఈ చట్టం ప్రకారం ప్రతి సంస్థలోనూ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ(ఐసీసీ)లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దేశంలోని 16 జాతీయ క్రీడా ఫెడరేషన్లలో ఐసీసీలు లేకపోవడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.