చండూరు: చండూరు మున్సిపాలిటీలో బీజేపీకి వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వెలిసాయి. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రూ.3 వేలు పింఛన్ ఇస్తామన్న నేతల తీరును ఎండగడుతూ గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపాలిటీ వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. రాష్ట్రంలో ఇచ్చే పింఛన్కంటే ఏ రాష్ట్రామైనా ఎక్కువ ఇస్తున్నదా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తున్నదని చెప్పే దమ్ముందా అని రాజగోపాల్కు సవాల్ విసిరారు. ఏ రాష్ట్రంలో ఎంత పెన్షన్ అందిస్తున్నారో పోస్టర్లలో వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల కంటే ఎక్కువ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీని నెరవేర్చని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా దండుమల్కాపురంలో ఫ్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది.. పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం దండుమల్కాపురంలో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది. అయితే హామీ ఇచ్చి ఆరేండ్లు పూర్తవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో ఆ స్థలం వృథాగా ఉండిపోయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన కొందరు వ్యక్తులు ఆ స్థలంలో జేపీ నడ్డాకు సమాధి కట్టి తమ నిరసన తెలియజేశారు.