హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దని పేర్కొంది.
ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
ఆదివారం అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మి.మీ. వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్లో 2 మి.మీ., భద్రాచలం-కొత్తగూడెంలో 54.6, దుండిగల్ 21.4, హకీంపేట 46.6, హనుమకొండ 35.6, హైదరాబాద్ 18.9, ఖమ్మం 29.8, మెదక్ 60, నల్లగొండ 10.2, నిజామాబాద్ 12.4, పటాన్చెరులో 52.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.