హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. గురు, శుక్ర, శనివారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నెల 14వ తేది నుంచి 16వ తేది వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో తొలుత సోమ, మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించారు. గురువారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలో వాతావరణశాఖ, విద్యాశాఖ అధికారులతో ఉన్నతాధికారులు సమీక్షించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సెలవులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.