హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఖజానాకు మరో రూ.2,500 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. 14 ఏండ్ల కాల పరిమితితో తెలంగాణ సర్కారు ఈ రుణాన్ని పొందింది. ఇప్పటివరకూ రూ.8 వేలకోట్ల రుణాలను బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే.. కేంద్రం మాత్రం దీనికి ఆదిలోనే మోకాలడ్డింది. బడ్జెట్, అప్పులు తదితర సాకులను చూపుతూ రెండునెలల పాటు రుణాలు తీసుకోకుండా అడ్డుకున్నది. కేంద్రం కుట్ర వల్ల తెలంగాణ సుమారు రూ. 8 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. తాజాగా తీసుకున్న రూ.2,500 కోట్లతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ మొత్తం రూ.10,500 కోట్ల రుణాలను రాష్ట్రం సమీకరించుకున్నది.