హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సామాజిక మాధ్యమాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేసినవారికి ఈ ఏడాది పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) అందజేసిన అవార్డుల్లో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఐదింటిని కైవసం చేసుకున్నది. ఈ నెల 21, 22న న్యూఢిల్లీలో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్లో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్ కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చేతులమీదుగా అందుకున్నారు. సోషల్ మీడియా ఉత్తమ వినియోగంతోపాటు ఉత్తమ వార్షిక నివేదిక క్యాటగిరీలో తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కు, ప్రజా సేవలకు సంబంధించిన ప్రకటనల విభాగంలో ‘మన ట్యాంక్బండ్ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం’ వీడియోకు, బెస్ట్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ క్యాటగిరీలో ‘కాళేశ్వరం’ (తెలంగాణ జల విప్లవం) వీడియోకు పీఆర్సీఐ అవార్డులు లభించాయి.