Breakfast Scheme | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రజాసంక్షేమం అమలులో దేశంలోనే ఖ్యాతి పొందిన కేసీఆర్ పథకాల్లో మరొకదాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కొన్ని తెలంగాణ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తుండగా, తెలంగాణలో కొనసాగుతున్న సర్కారు బడుల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. తెలంగాణ తరహాలో దేశవ్యాప్త అమలు కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నది. పీఎం పోషణ్ స్కీంలో భాగంగా దీనిని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీని అమలకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. సర్కారు బడుల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు, పోషకాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పేరిట కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ పథకం తెలంగాణలో నేటికీ కొనసాగుతున్నది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు.
దాదాపు 23 లక్షల విద్యార్థులకు లబ్ధి
విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిరుడు అక్టోబర్లో ప్రారంభించగా, ఇప్పటివరకూ నిరాటంకంగా అమలవుతున్నది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 బడుల్లో అమలు చేసేందుకు సంకల్పించగా, దాదాపు 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున 119 స్కూళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత మండలానికి ఒక స్కూల్ చొప్పున విస్తరించారు. క్రమంగా మండలానికి రెండు, మూడు చొప్పున విస్తరిస్తూ వచ్చారు. ఇప్పటివరకు 3,500కు పైగా బడుల్లో ఈ పథకం అమలవుతున్నది. రాష్ట్రంలోని విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తోపాటు, మధ్యాహ్న భోజనం, రాగిజావను అందజేస్తున్నారు. తాజాగా తెలంగాణ తరహాలో కేంద్రం ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రావడం విశేషం.