
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సకు హైదరాబాద్ కేంద్రంగా మరో ఔషధం ఉత్పత్తి కానున్నది. ప్రముఖ హైదరాబాదీ ఫార్మాసంస్థ నాట్కో ఫార్మా ‘మాల్నుపిరవిర్’ పేరుతో దీనిని అందుబాటులోకి తేనున్నది. అమెరికాకు చెందిన మేజర్మెర్క్, రిడ్జ్బ్యాక్ సంస్థలు ‘మాల్నుపిరవిర్’ ట్యాబ్లెట్లను అభివృద్ధి చేశాయి. ఇవి కొవిడ్ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ ఔషధాన్ని భారత్తో ఉత్పత్తి చేసేందుకు నాట్కో ఫార్మాతో గతంలోనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇప్పటికే ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ సైతం నిర్వహించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని నాట్కోఫార్మా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఇన్ఫ్లూయెంజా లక్షణాలను తగ్గిస్తున్నదని, కొవిడ్ రోగుల్లోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని పేర్కొన్నది. మాల్నుపిరవిర్ను వినియోగించిన ఐదురోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని తెలిపింది. దీంతో ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్తోపాటు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) దరఖాస్తు చేసినట్టు వెల్లడించింది. సీడీఎస్సీవో నుంచి అనుమతులు రాగానే వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసి, దవాఖానలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నది. తద్వారా సెకండ్వేవ్లో రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేసింది.