చొప్పదండి, ఏప్రిల్ 30 : ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోరైతు బలయ్యాడు. పండించిన ధాన్యం పైనే ప్రాణం విడిచాడు. ధాన్యం విక్రయించడానికి వచ్చిన ఆయన అక్కడే విగతజీవిగా మారగా.. సంఘటన స్థలం వద్ద పంచనామా చేయకుండా హడావిడిగా మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో పోస్టుమార్టం నిర్వహించేదుకు తీసుకెళ్లారు.
ఈ ఘటనతో చొప్పదండి మండలం రాగంపేటలో విషాదం నెలకొన్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రైతు ఐతరవేణి రాజేశం (47)కు రెండెకరాల 20 గుం టల వ్యవసాయ భూమి ఉన్నది. భార్య మల్లేశ్వరితో కలిసి వ్యవసాయం చేస్తూ కొడుకు రాజు, కూతురు స్రవంతిని పోషించుకుంటున్నాడు.
కొడుకును బీటెక్ చదువుతుండగా, కూతురు పదోతరగతి పూర్తిచేసింది. ఎస్సారెస్పీ కాలువ ఎగువన ఉన్న రెండున్నర ఎకరాల్లో బావి ద్వారా వచ్చే నీటితో పొలం సాగుచేసిన రాజేశం పంట దిగుబడి బాగా వచ్చేదాకా అహర్నిషలు కష్టపడ్డాడు. ఐదు రోజుల కిందటే పొలం కోసిన రాజేశం ధాన్యాన్ని రాగంపేట కేంద్రానికి తీసుకు వచ్చాడు.
అప్పటికే అక్కడ కుప్పులు తెప్పలుగా ధాన్యం నిల్వలు ఉండటంతో.. ఆ పక్కనే ఉన్న రోడ్డుపై ధాన్యం దింపుకొన్నాడు. నిబంధనల ప్రకారం మాయిశ్చర్ కోసం రోజూ ధాన్యం ఆరబెడుతున్నాడు. మంగళవారం ధాన్యాన్ని నేర్పుతుండగా.. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో తనధాన్యం కుప్పపైనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న రైతులు వెంటనే 108కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలించి చనిపోయినట్లుగా నిర్ధారించారు.
పంచనామా చేయకుండానే?
రాజేశం మృతదేహాన్ని 108లో ఆయన ఇంటికి తరలించడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడే మృతదేహం ఉంటే.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కడ బయటపడుతుందోనని, రైతులు ఎక్కడ ఆందోళనకు దిగుతారోనని, పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అని భావించి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా.. ఇంటికి తరలించారన్న విమర్శలు వచ్చాయి. దాంతో ఆ తర్వాత మేల్కొన్న అధికారులు పోస్టుమార్టం కోసం తరలించారు.
కొనుగోళ్లలో జాప్యంతోనే..
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని స్థానిక రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా రైతులు ధాన్యం కుప్పల వద్దనే నిరీక్షిస్తూ ప్రా ణాలు కోల్పోతున్నారని తెలిపారు. రాజేశం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ధా న్యం కొనుగోళ్లను వేగిరం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని రైతు సంఘం నేతలు కోరారు.
ఇది కాంగ్రెస్ సర్కార్ హత్యే
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని అన్నారు. కేంద్రాల్లో సమయానికి కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిందని, ప్రభుత్వ హత్యగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. రాజేశం కుటుంబానికి కాంగ్రెస్ సర్కారు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.