నర్మెట, ఫిబ్రవరి 11 : పంటలు చేతికి రాక.. అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య పదుల సంఖ్యలో రైతులు బలవన్మరణం చెందారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్మెట మండల కేంద్రానికి చెందిన ముక్కెర బాలరాజు (38) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి, మక్క పంటలు సాగు చేశాడు.
వడగండ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికితోడు ఈ సారి కూడా పంటలు సరిగా లేకపోవడంతో కుటుంబం గడవలేని పరిస్థితి నెలకొన్నది. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన బాలరాజు ఆదివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పశువుల పాకలో ఉరేసుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.