హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పరీక్షల నిర్వహణను అడ్డుకోవాలి. ఉద్యోగాలు భర్తీచేయకుండా నిలువరించాలి. ఉద్యోగార్థుల్లో కల్లోలం రేపి. ఆగం చేయాలి.. ఇదీ కొంత మంది కుట్రదారుల ప్రయత్నం. ఏదో ఒకటి సృష్టించి బట్టకాల్చి మీదెయ్యాలి. తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అన్నట్టుగా ఈ దుర్మార్గుల వ్యవహారం ఉన్నది. గ్రూప్-4 పరీక్షల సందర్భంగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. జూలై 1న జరిగే ఈ పరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఇటీవలే హాల్టికెట్లను విడుదల చేశారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నవ్యశ్రీకి రెండు హాల్టికెట్లు జారీ అయినట్టుగా కొందరు దుర్మార్గులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక సెంటర్, హైదరాబాద్లో మరో సెంటర్ కేటాయించినట్టు నకిలీ హాల్టికెట్లను సృష్టించి పోస్టుచేశారు. ఈ విషయం టీఎస్పీఎస్సీ దృష్టికి రావడంతో స్పందించిన అధికారులు.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్లో పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
నవ్యశ్రీకి భదాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తూ జారీచేసిన హాల్టికెట్ను అసలైనదిగా, హైదరాబాద్ దక్కన్ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించిన హాల్టికెట్ను నకిలీదిగా తేలడంతో దీనిపై విచారణ జరుపుతున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. మొన్నటికి మొన్న గ్రూప్-1 ప్రిలిమ్స్కు దరఖాస్తు చేయకుండానే హాల్టికెట్ జారీచేశారంటూ ఫేక్రాయుళ్లు తప్పుడు ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు దరఖాస్తు చేస్తే.. గ్రూప్-1 హాల్టికెట్ జారీచేశారని దుష్ప్రచారం చేశారు. దీనిపై అధికారులు విచారణ జరపడంతో అదంతా ఉత్తదేనని తేలిపోయింది. తాజాగా మరో గందరగోళం సృష్టించేందుకు ఫేక్ రాయుళ్లు ప్రయత్నించగా.. అదీ బూటకమేనని నిరూపితమైంది. దీంతో అభ్యర్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని టీఎస్పీఎస్సీ వర్గాలు సూచించాయి.