బంజారాహిల్స్, జనవరి 8: బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖానలో నాలుగో డే కేర్ యూనిట్ను శనివారం దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కీమో థెరపీ రోగుల కోసం డే కేర్ యూనిట్ సేవలు అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. ఇప్పటికే డే కేర్ విభాగంలో 42 పడకలు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా ఏర్పాటు చేసిన యూనిట్లో మరో 21 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. అందరికీ అత్యాధునిక చికిత్స అందిస్తున్న తమ దవాఖానలో మొత్తం 181 పడకలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన దేశంలోని లాభాపేక్షలేని దవాఖానల్లో తమ దవాఖానకు గుర్తింపు లభించిందని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, దవాఖాన సీఈవో ప్రభాకర్రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్రావు, సూరింటెండెంట్ డాక్టర్ ఫణికోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.