Polytechnic | హైదరాబాద్ : పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ను విడుదల చేశారు. అభ్యర్థులు రూ.3వేలు పరీక్ష ఫీజును.. ఏప్రిల్ 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఇక రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, తాత్కాల్ స్కీం కింద ఎగ్జామ్ ఫీజుతో పాటు మరో రూ.6వేల అదనంగా కలిపి ఏప్రిల్ 15 వరకు చెల్లించాలని సూచించారు.
ఇక ఇండస్ట్రియల్ అసెస్మెంట్ ఫీజుగా రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సును గరిష్టంగా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిలబస్ను మార్చడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం లభించడం లేదు. అయితే, కొన్నిసార్లు మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిస్తుంది. ఇలా ఈ సారి 1990 నుంచి 2018 వరకు గల అభ్యర్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులకు పరీక్షలు రాసుకునే అవకాశానిచ్చారు. అంతేకాకుండా.. వీరికి మూడు సబ్జెక్టుల నుంచి
మినహాయింపునిచ్చారు. ఇలాంటి వారంతా తాజాగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనాథ్ సూచించారు. 1990 నుంచి పాస్ కాలేకపోయిన వారి సంఖ్య వెయ్యికిపైగా ఉన్నదని తెలిపారు.
ఒక విద్యార్థి 12 సబ్జెక్టులు ఫెయిలైతే.. సంబంధిత అభ్యర్థి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపు పొంది 9 సబ్జెక్టులకు పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. ఇలా ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే వాటి నుంచి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిస్తారు. ఎవరైనా ఒకరు నాలుగు సబ్జెక్టులు ఫెయిలైన పక్షంలో ఇప్పుడు మూడింటి నుంచి మినహాయింపు పొంది ఒక సబ్జెక్టుకు పరీక్షరాసి పాస్అయితే సరిపోతుంది.