హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించకపోతే తెలంగాణలో ‘మరో సకల జనుల సమ్మె’ తప్పదని పలువురు వక్తలు హెచ్చరించారు. కమిటీలతో ఇంకా ఎంతకాలం తమను మభ్యపెడుతూ, కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. బుధవారం గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు అక్కడి నుంచే సమ్మె ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా గన్పార్క్ వద్దకు చేరుకొన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో అగ్రభాగా ఉన్న ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఒక్కసారి ఆర్టీసీ ప్రైవేట్పరమైతే ప్రజలకు భారం తప్పదని హెచ్చరించారు. ఇది ఒక ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, యావత్తు తెలంగాణ ప్రజల సమస్య అని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విలీనంపై సర్కార్ వైఖరేమిటో చెప్పాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రశ్నించారు. ఎంతవరకైనా పోరాడేందుకు కార్మికవర్గం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. అధికారుల కమిటీ ఎలాంటి సమస్యలకూ పరిష్కారం చూపలేదని తెలిపారు. తమను పిలిచిన చర్చల్లో ఒక్క మంత్రి లేరని, అందుకే ఐఏఎస్ అధికారుల కమిటీ చేతులెత్తేసిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్రవ్యాప్తంగా సకల జనుల మద్దతు ఉన్నదని ఆర్టీసీ కార్మిక జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేయకుండా చేతల్లో తమ పనితనం చూపించాలని డిమాండ్ చేశారు. నాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ఇప్పుడు వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.