హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖ నిరంతర ప్రోత్సాహంతో సీఐడీలోని ఫింగర్ ఫ్రింట్స్ బ్యూరో నిపుణుల గనిగా అవతరించింది. జాతీయస్థాయిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల నిర్వహించిన ‘ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్’ పరీక్షలో తెలంగాణకు చెందిన 24 మంది ఏఎస్ఐలు రెండో ర్యాంకు మినహా టాప్-24లో నిలిచి జాతీయస్థాయిలో సర్టిఫికెట్లు అందుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ విభాగంలోని 53 మంది సిబ్బంది ఎక్స్పర్ట్స్గా జాతీయస్థాయి సర్టిఫికెట్లు పొందినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఫింగర్ ప్రింట్స్ ఏఎస్ఐలుగా రిక్రూట్ అయిన మూడేండ్ల తర్వాత జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ పరీక్షకు ఈసారి దేశవ్యాప్తంగా 112 మంది హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి హాజరైన 24 మంది రెండో ర్యాంకు మినహా టాప్-1 నుంచి 24 వరకు వరుస స్థానాల్లో నిలిచారు. మొత్తం 250 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 235.5 మార్కులు సాధించి తెలంగాణ ఏఎస్ఐ ఒకరు అగ్రస్థానంలో నిలిచారు. రెండోస్థానంలో నిలిచిన తమిళనాడు ఏఎస్ఐకి 235 మార్కులు వచ్చాయి. ఆ తర్వాతి నుంచి 24వ ర్యాంకు వరకు అన్నింటినీ మనవారే కొల్లగొట్టినట్టు ఏడీజీ మహేశ్ భగవత్ తెలిపారు. జాతీయస్థాయి సర్టిఫికెట్లు సాధించడంతో ఇప్పుడు వారు కోర్టులకు సమర్పించే రుజువులకు మరింత విలువ పెరగనుంది.